భారతదేశంలో, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిరుపేద ఎస్సీ ప్రజలపై జరుగుతున్న దాడులను, అక్రమంగా నమోదవుతున్న తప్పుడు కేసులను నిరోధించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గవ్వల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ మంగళవారం న్యూఢిల్లీకి వెళ్లి నేషనల్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికారి గూడ శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు, ఎస్సీ సామాజిక నేతలపై రాజకీయ పునాదులపై అక్రమ కేసులు నమోదు చేయడం, మహిళలతో తప్పుడు ఆరోపణలు చేస్తూ సంఘ సేవకుల జీవితాలను బలితీసుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వారు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, నిరుపేద ఎస్సీ విద్యార్థులు, సామాజిక సేవకులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సంఘ సేవకులు ఎస్సీ ప్రజల హక్కుల కోసం నిష్కల్మషంగా పోరాడుతున్న సమయంలో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం అభ్యంతరకరమని పేర్కొన్నారు. ఈ సమస్యపై నేషనల్ ఎస్సీ కమిషన్ తక్షణ స్పందనగా అన్ని రాష్ట్రాల డీజీ లతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ ప్రజల రక్షణ, తప్పుడు కేసుల విచారణ కోసం కమిషన్ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని, సంఘ సేవకులకు న్యాయం కలిగించాలన్న కోరారు. ఈ భేటీలో తెలంగాణ సింగరేణి విఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఫోరం ప్రధాన కార్యదర్శి సుంకర శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ముగింపులో ప్రతినిధి బృందం, ఐఏఎస్ శ్రీ గూడ శ్రీనివాస్ను పూల బొకేతో మర్యాదపూర్వకంగా సన్మానించింది.