పిల్లల బుర్ర తినకండి
పదో తరగతి మరియు సీబీఎస్ఈ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల కంటే తల్లిదండ్రులే ఎక్కువ ‘టెన్షన్’ పడుతుంటారు. పిల్లలను అనుక్షణం వెంబడిస్తూ, మిషన్ ఫాలో అప్ లా ఏదో ఒకటి చదవమని ఒత్తిడి చేయడం వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. జిగ్ జాగ్ గా ఉన్న దారాన్ని విడదీయడానికి ఎంత ఓపిక కావాలో, ఈ సమయంలో పిల్లలను అర్థం చేసుకోవడానికి అంతే ఓపిక అవసరమని వ్యక్తిత్వ వికాస నిపుణులు మాచన రఘునందన్ సూచిస్తున్నారు.
పక్షిలా స్వేచ్ఛనివ్వండి
కరెంటు తీగలకు ఉన్న మాంజాలో పక్షి చిక్కుకుంటే మనం ఎంతలా బాధపడతామో, పరీక్షల ఒత్తిడిలో పిల్లలు కూడా అలాగే చిక్కుకుపోతారు. వారిని ఈ కొద్ది రోజులు “బీ యువర్ సెల్ఫ్” (నీలా నువ్వు ఉండు) అని స్వేచ్ఛగా వదిలేయండి. పరీక్షల ముందు పరేషాన్ చేయడం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. వారికి ఏం కావాలో, ఏం చదువుకున్నారో వారికి తెలుసునని గుర్తించాలి.
యుద్ధానికి వెళ్తున్నారా?
పిల్లలు ఏదో సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్తున్నట్లుగా తల్లిదండ్రులు ఫీల్ అవ్వడం మానుకోవాలి. కని పెంచి పెద్ద చేసిన వారే కంగారు పడితే, పిల్లలు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. వారిని ఒక సూపర్ ఇన్నింగ్స్ ఆడటానికి వెళ్తున్న ధోనీలా ఊహించుకోండి. వారికి కావాల్సింది భయం కాదు, మీరిచ్చే భరోసా మరియు ధైర్యం మాత్రమే.
ఇంట్లో ప్రశాంతత ముఖ్యం
ఇంటి వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే, విద్యార్థి మెదడు అంత చురుగ్గా పనిచేస్తుంది. అనవసరమైన ఊహలతో మైండ్ ఖారాబ్ చేసుకోవద్దు. మెదడుకు కావాల్సిన ఆలోచనా స్వేచ్ఛను ఇవ్వండి. చదువు విషయంలో పదే పదే “ఎట్లా రాస్తావు? ఎట్లా వస్తుంది?” అని అడగడం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది.
దర్యాప్తు సంస్థల్లా ప్రవర్తించకండి
పరీక్ష రాసి కేంద్రం నుంచి బయటకు రాగానే.. “పేపర్ ఎట్లొచ్చింది? బాగా రాశావా? ఎన్ని మార్కులు వస్తాయి?” అని సిబిఐ లేదా ఇతర దర్యాప్తు సంస్థల తరహాలో ప్రశ్నల వర్షం కురిపించకండి. వారు ప్రశాంతంగా ఇంటికి వచ్చేలా చూడండి. ఎలా రాశారో వారే చెప్పే వరకు వేచి ఉండండి. వారిని నిలదీయడం వల్ల తర్వాతి పరీక్షపై ప్రభావం పడుతుంది.
బ్యాట్ వారిది.. ఆట వారిది
ఏ బంతిని ఎలా ఆడాలో, స్కోరు ఎలా చేయాలో ఆ విద్యార్థికి వదిలేయండి. వారి శక్తి సామర్థ్యాలపై నమ్మకం ఉంచండి. తల్లిదండ్రులు చేయాల్సిందల్లా వారి వెనుక ఉండి నైతిక మద్దతు ఇవ్వడం మాత్రమే. “ఉతికి ఆరేస్తారో.. సిక్సర్ కొడతారో” అది వారి ప్రతిభకు వదిలేయాలని, అనవసరపు ఒత్తిడితో వారిని ఇబ్బంది పెట్టవద్దని నిపుణులు కోరుతున్నారు.
ప్రేమను పంచండి
చివరిగా.. డియర్ పేరెంట్స్, మీ పిల్లలకు ఈ సమయంలో కావాల్సింది మీ ప్రేమ మరియు ఆత్మీయత. కంగారును పక్కన పెట్టి, వారిలో ధైర్యాన్ని నింపండి. పదో తరగతి అనేది జీవితంలో ఒక మెట్టు మాత్రమే తప్ప, అదే జీవితం కాదని వారికి అర్థమయ్యేలా చెప్పండి. నిర్భయంగా, నిస్సంకోచంగా పరీక్ష రాసే వాతావరణాన్ని కల్పించండి.
మాచన రఘునందన్
వ్యక్తిత్వ వికాస నిపుణులు
9441252121
![]()
