జూన్ 1 లేదా 15లోపు పనులు పూర్తి చేసేలా ప్రణాళిక: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ప్రెస్ మీట్, మంచిర్యాల, సెప్టెంబర్ 19: మంచిర్యాల పట్టణ ప్రజలు, ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని పాత బస్టాండ్ను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు.
బస్టాండ్ను ఆర్టీసీ అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఫౌండేషన్ వేసి ప్రారంభించిన ఈ బస్టాండ్ను 1979లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ప్రారంభించారని తెలిపారు. దాదాపు 47 ఏళ్లుగా కొనసాగుతున్న బస్టాండ్ ప్రస్తుతం పూర్తిగా పాతబడిపోయిందన్నారు.
బస్టాండ్, డిపోకు కలిపి సుమారు 6 ఎకరాల స్థలం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో సుమారు 4.5 ఎకరాలు డిపోకు, 1.5 ఎకరాలు బస్టాండ్కు వినియోగిస్తున్నట్లు వివరించారు. అందుబాటులో ఉన్న స్థలాన్ని అవసరానికి అనుగుణంగా వినియోగించి ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రయాణికుల కోసం ఆధునిక వెయిటింగ్ హాళ్లు, వాష్రూమ్లు, పరిశుభ్రమైన సౌకర్యాలతో బస్టాండ్ను హైటెక్ స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందేలా సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వ భాగస్వామ్యంతో బస్టాండ్ ఆధునీకరణ పనులకు సుమారు రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు అంచనా వ్యయం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమన్నారు.
రాబోయే జూన్ 1లోపు లేదా జూన్ 15లోపు పనులు పూర్తిచేసి బస్టాండ్ను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఇందుకు అవసరమైన సమన్వయంతో పనులు ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రాజశేఖర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ పాల్గొన్నారు.
మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
![]()

