సింగరేణి యాజమాన్యంపై కార్మిక సంఘం ఆగ్రహం.. ‘చలో జీఎం ఆఫీస్’కు హెచ్చరిక
ప్రెస్ మీట్, మంచిర్యాల, సెప్టెంబర్ 19: మందమర్రి డివిజన్ పరిధిలో సింగరేణిలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులుగా గత 12 ఏళ్లుగా పనిచేస్తున్న సుమారు 70 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల ఐక్య సంఘం (SCKIS-CTU) బెల్లంపల్లి రీజియన్ నాయకులు డిమాండ్ చేశారు.
టెండర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 50 మందిని విధుల్లోకి తీసుకోలేదని, డ్యూటీలకు తీసుకున్న అనంతరం రిపోర్టింగ్ పేరుతో మరో 19 మందిని తొలగించారని సంఘం నాయకులు ఆరోపించారు. దీంతో మొత్తం సుమారు 70 మంది ఉపాధి కోల్పోయారని తెలిపారు.
టెండర్ ప్రక్రియలో అధికారుల తప్పిదాల వల్ల సమస్య ఏర్పడితే కొత్త టెండర్ పిలిచి కార్మికులకు ఉపాధి కల్పించాలని కోరుతూ నెల రోజులపాటు ఆందోళన చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే జీఎంతో మాట్లాడి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని సూచించారని, జీఎం కూడా హామీ ఇచ్చారని సంఘం నాయకులు తెలిపారు.
అయితే కొత్త టెండర్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీని అమలు చేయకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
సంఘం గౌరవాధ్యక్షుడు సంకె రవి, కార్యదర్శి దూలం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత రెండు నెలలుగా జీఎం కార్యాలయం, ఏరియా సెక్యూరిటీ అధికారి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
12 ఏళ్లుగా ఇదే ఉపాధిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులను విధులకు దూరం చేయడం సమంజసం కాదని ప్రశ్నించారు. కార్మిక శాఖ మంత్రి, చెన్నూర్ ఎమ్మెల్యే స్పందించి 70 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
సింగరేణి అధికారులు ఇప్పటికైనా స్పందించి కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలను ఏకం చేసి ‘చలో జీఎం ఆఫీస్’ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.
![]()

