వివాహ వ్యవస్థను కాపాడటమే సంబంధిత చట్టాల ప్రాథమిక లక్ష్యమైనప్పటికీ, భార్యాభర్తలు సుదీర్ఘకాలం పాటు విడివిడిగా జీవిస్తున్నప్పుడు ఆ పరిస్థితిలోని వాస్తవికతను గుర్తించక తప్పదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. 2005 డిసెంబరు నుంచి అంటే దాదాపు రెండు దశాబ్దాలుగా వేర్వేరుగా ఉంటున్న ఒక దంపతుల వివాహ బంధాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు
జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్ర, జస్టిస్ శ్రీచంద్రశేఖర్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులో బుధవారం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా భార్యకు శాశ్వత భరణం (Permanent Alimony) కింద రూ. 7 లక్షలు చెల్లించాలని భర్తను ఆదేశిస్తూ విడాకులు మంజూరు చేసింది.
మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల రద్దు
గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తనకు విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ భర్త సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భర్తను విడిచిపెట్టే ఉద్దేశం భార్యకు లేదని భావిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుబట్టింది. భర్త ఎన్నిసార్లు అత్తవారింటికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా, సరియైన కారణం లేకుండానే భార్య నిరాకరించిందని కోర్టు గుర్తుచేసింది.
కీలక అంశాలను ప్రస్తావించిన ధర్మాసనం
ఈ కేసులో దంపతులకు పిల్లలు లేకపోవడం, ఇన్నేళ్లలో పలుమార్లు చేసిన రాజీ ప్రయత్నాలన్నీ విఫలం కావడం వల్ల వివాహ బంధం పూర్తిగా దెబ్బతిన్నదని కోర్టు పేర్కొంది. భార్య తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తించడానికి సుముఖంగా ఉన్నానని చెబుతున్నప్పటికీ, ఆమె ప్రవర్తన దానికి విరుద్ధంగా ఉన్నందున కేవలం మాటల హామీ సరిపోదని స్పష్టం చేసింది.
సరిచేయలేని విధంగా వివాహ బంధం దెబ్బతిన్నప్పుడు మరియు దంపతులు దీర్ఘకాలంగా విడిపోయినప్పుడు విడాకులు ఇవ్వడమే సముచితమని గత తీర్పులను కూడా ధర్మాసనం ఈ సందర్భంగా ఉదహరించింది.
![]()




