ప్రపంచ వ్యాప్తంగా చైనా (China) ప్రభుత్వం అత్యంత విస్తృత స్థాయిలో నిఘా వలయాన్ని (Global Surveillance System) ఏర్పాటు చేసినట్లు అమెరికాకు చెందిన ఓ ప్రముఖ పత్రిక ప్రచురించిన కథనం తీవ్ర కలకలం రేపుతోంది. సుమారు 140 కోట్లకు పైగా ప్రజలపై చైనా నిఘా పెట్టినట్లు, ఇందులో సొంత పౌరులతో పాటు చైనా పర్యటనకు వచ్చిన విదేశీయులు కూడా ఉన్నట్లు ఆ కథనం పేర్కొంది.
సైబర్ పరిశోధకుడికి దిగ్భ్రాంతి గొలిపే నిజాలు
చైనా తన పౌరులపై ఎలాంటి నిఘా పెడుతుందనే అంశంపై జనవరిలో సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు మార్క్ హోఫర్ ఆన్లైన్లో పరిశోధన చేస్తుండగా ఈ దిగ్భ్రాంతి కరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ‘డైనమిక్ కంట్రోల్ ప్లాట్ఫామ్ ఫర్ ఓవర్సీస్ పర్సనల్’ (Dynamic Control Platform for Overseas Personnel) అనే వెబ్సైట్లో స్వయంగా తన పేరు, ఫోటో, పాస్పోర్ట్ నంబర్ మరియు గతంలో చైనా పర్యటనలో వాడిన మొబైల్ నంబర్తో సహా సున్నితమైన సమాచారమంతా ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు.
జాంగ్ జియాకోవు నగరం కేంద్రంగా ట్రాకింగ్.. భారతీయులే అధికం!
ఈ వెబ్సైట్లో ముఖ్యంగా చైనాలోని జాంగ్ జియాకోవు (Zhangjiakou) నగరానికి వచ్చిన విదేశీ సందర్శకుల డేటా ఎక్కువగా నమోదైనట్లు గుర్తించారు.
- బాధితుల దేశాలు: భారత్, పాకిస్థాన్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, బ్రిటన్, అమెరికా, ఈజిప్ట్, ఇరాన్, ఇజ్రాయెల్, మొరాకో, సూడాన్.
- భారత విద్యార్థులపై కన్ను: జాంగ్ జియాకోవులోని హెబే నార్త్ యూనివర్సిటీలో చేరిన విదేశీ విద్యార్థుల పూర్తి సమాచారం ఇందులో ఉంది. వీరిలో భారత్, పాకిస్థాన్లకు చెందిన విద్యార్థులే అధికంగా ఉండటం గమనార్హం.
కెమెరాలు, ఫోన్ సిగ్నల్స్తో నిరంతర నిఘా
అధికారులు సందర్శకులను కేవలం చైనాలో ఉన్నంత కాలమే కాకుండా, వారి వ్యక్తిగత వివరాలు, ప్రయాణాలు, కదలికలను అధునాతన కెమెరాలు మరియు ఫోన్ సిగ్నల్స్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. దారుణమైన విషయమేమిటంటే.. ఈ ప్రయాణికులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయిన తర్వాత కూడా చైనా నిఘా కొనసాగుతుండడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగిస్తోంది.
పోలీసులకు నేరుగా యాక్సెస్.. ప్రయాణాల డేటా సీజ్
చైనా పోలీస్ విభాగాలకు రోబోటిక్స్, స్పైవేర్ పరికరాలను సరఫరా చేసే ‘ఆరిజిన్ డైనమిక్’ అనే సంస్థకు ఈ వెబ్సైట్తో బలమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
- ప్రజలు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు?
- వారు ఇష్టపడే ప్రాంతాలేమిటి?
- ప్రయాణించిన విమానాలు, రైళ్లు మరియు వాటి సీటు నంబర్లతో సహా పూర్తి డేటా అక్కడి పోలీసులకు అందుబాటులో ఉంచబడింది.
- 2019 హాంకాంగ్ ప్రజాస్వామ్య నిరసనల తర్వాత చైనా ప్రభుత్వం విదేశీ భాగస్వాములు, పౌరులపై నిఘాను మరింత తీవ్రతరం చేసింది.
హడావుడిగా డేటా డిలీట్.. చైనా మౌనం
ఈ సంచలన విషయం వెలుగు చూసే సూచనలు కనిపిస్తుండటంతో మే నెలలో సదరు వెబ్సైట్లోని సమాచారమంతా అకస్మాత్తుగా అదృశ్యమైంది. అయితే సైబర్ పరిశోధకుడు మార్క్ హోఫర్ అంతకుముందే ఆ డేటాను డౌన్లోడ్ చేసుకోవడంతో ఈ అంతర్జాతీయ నిఘా కోణం బయటపడింది. ప్రస్తుతం ఈ ఆరోపణలు, కథనాలపై చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
![]()




