సామాజిక మాధ్యమాల్లో 15 ఏళ్ల ఓ మైనర్ బాలిక అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడిన వీడియో వైరల్ కావడం, ఆ తదనంతరం సదరు బాలిక చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్న దృశ్యాలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓ చిన్నారి చేసిన పొరపాటును సమాజం ఎదుర్కొన్న తీరు, ఆపై వచ్చిన స్పందనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జంతర్ మంతర్ వద్ద మాట్లాడారు. ఈ ఘటనపై ఆయన ఎంతో ఉద్వేగంతో, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు.
“15 ఏళ్ల బాలిక భయంతో క్షమాపణ కోరడం మనసును తొలిచేస్తోంది”
వైరల్ వీడియోలో 15 ఏళ్ల బాలిక అసభ్యంగా మాట్లాడటం ఖండించదగినదే అయినప్పటికీ, ఆ తర్వాత ఆ చిన్నారి తీవ్రమైన భయంతో తలవంచుకుని, చేతులు జోడించి క్షమాపణలు కోరుతున్న తీరు అంతకంటే ఎక్కువగా మనసును తొలిచివేస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఒక చిన్న తప్పునకు ఆ వయసున్న చిన్నారిని ఈ స్థాయిలో భయందోళనలకు గురిచేయడం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు.
ఆకతాయి పిల్లలను క్షమిస్తున్నా.. శిక్షల కంటే మార్గదర్శనమే ముఖ్యం!
నన్ను, మా అమ్మను కొందరు ఆకతాయి పిల్లలు తీవ్రంగా తిట్టారని, అయితే వారిపై ఎలాంటి కోపం లేదని, తాను వారిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటిస్తూ గొప్ప ఔదార్యాన్ని చాటుకున్నారు. కొంతమంది యువత సరైన మార్గం తెలియక దారి తప్పుతున్నారని, వారిని కేవలం శిక్షల ద్వారా మార్చలేమని ఆయన స్పష్టం చేశారు. నేటి యువతకు కావాల్సింది కఠినమైన చర్యలు కాదని, సరైన దిశానిర్దేశం మరియు సానుభూతితో కూడిన మార్గదర్శనమని స్పష్టం చేశారు.
“పళ్లు మనవే.. నాలుక మనదే” – మోడీ ఆత్మీయ విశ్లేషణ
యువత చేసే పొరపాట్లను కుటుంబంలో చిన్నపిల్లల తప్పులుగా భావించాలని చెబుతూ ప్రధాని ఒక చక్కటి ఉపమానాన్ని ఇచ్చారు. “కొన్నిసార్లు మన నోట్లోని పళ్ల మధ్య నాలుక పడి రక్తం కారుతుంది.. కానీ అక్కడ పళ్లు మనవే, నాలుక కూడా మనదే” అని పేర్కొన్నారు. సమాజంలో యువత దారి తప్పినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత పెద్దలపైనే ఉందని ప్రధాని ఆవేదనతో పిలుపునిచ్చారు.
![]()




