కొత్తగూడెం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ‘ధర్మ పోరాట సభ’ విజయవంతమైంది. ఈ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఏజెన్సీ ప్రాంత ఎస్సీల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2019 నూతన పంచాయతీ రాజ్ చట్టం వల్ల ఏజెన్సీ దళితులకు తీరని అన్యాయం జరిగిందని, రద్దయిన స్థానిక రిజర్వేషన్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. .
రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని, సిపిఐ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ మాట్లాడుతూ.. మైదాన ప్రాంత ఎస్సీలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంత దళితులపై ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉన్న పంట రుణాలు, స్థానిక ఉద్యోగ అవకాశాలు నేడు కరువయ్యాయని, హక్కుల సాధన కోసం దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, జేఏసీ రాష్ట్ర నాయకులు గోడ రమేష్, ఎస్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

![]()




