ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో సరికొత్త నిబంధనలు, క్షేత్రస్థాయి సవాళ్లు ఓటర్లను, అధికారులను కలవరపెడుతున్నాయి. ఈ సవరణ ప్రక్రియలో 24 ఏళ్ల క్రితం, అంటే 2002 నాటి ఓటు వివరాలు కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారాయి. నాటి ఓటు ఎక్కడుందో కచ్చితంగా చెబితేనే ప్రస్తుత ఓటుకు ధ్రువీకరణ (Verification) లభిస్తుండటంతో సామాన్య ఓటర్లు తలలు పట్టుకుంటున్నారు.
2002 ఓటు వివరాల లింకింగ్
ప్రస్తుత ఓటరు కార్డును పాత రికార్డులతో అనుసంధానించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం. ఒకవేళ 2002 నాటికి సదరు ఓటరుకు ఓటు హక్కు లేకపోతే, వారి తల్లిదండ్రుల ఓటు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రుల వివరాలు కూడా లభించని పక్షంలో, తాత ముత్తాతల పేర్లనైనా నాటి జాబితాతో అనుసంధానించుకోవాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు.
ఓటర్ల ఆరా.. బంధువులకు ఫోన్లు
రెండు దశాబ్దాల క్రితం తాము ఎక్కడ ఓటు వేశామో చాలా మందికి గుర్తుండటం లేదు. దాంతో ఓటర్లు తమ సొంతూళ్లు ఎక్కడో తెలుసుకుని, అక్కడ నివసిస్తున్న పాత బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు. అయితే, 2002 వివరాలు తెలియకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ఓటు వివరాలతో ‘ఈఎఫ్’ (Enumeration Forms) ఫారాలు పూర్తి చేసి గడువులోపు ఇవ్వవచ్చని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
తాళాలు వేసిన ఇళ్లు.. అపార్ట్మెంట్లలో సమస్యలు
నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ గణన పత్రాలు అందలేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఎండాడ, మాధవధార, మధురవాడ వంటి శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించిన అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. బీఎల్వోలు (BLO) సర్వే కోసం వెళ్లే సమయానికి చాలా ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో, వారు ఆ పత్రాలను వాచ్మెన్లకు ఇవ్వడమో లేదా తలుపుల వద్ద పెట్టడమో చేస్తున్నారు. దీనివల్ల ఆ ఫారాలు తిరిగి వెనక్కి రావడం లేదు.
మారుతున్న చిరునామాలు.. బీఎల్వోల లబోదిబో
నగరాల్లోని ఓటర్లు ఒకే చోట స్థిరంగా ఉండకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. ఓటరు జాబితాలో ఉన్న చిరునామాకు వెళితే అక్కడ వారు ఉండటం లేదు. పొరుగు ఇళ్లలో విచారించినా వారి సమాచారం లభించడం లేదు. అందుబాటులో ఉన్న ఫోన్ నంబర్లకు కాల్ చేస్తే కొందరే స్పందిస్తున్నారని, చాలా మంది వివరాలు సరిగ్గా చెప్పడం లేదని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేల సంఖ్యలో పెండింగ్ పత్రాలు
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మల్కాపురం, ఏకేసీ కాలనీ, షిప్యార్డు ఏరియా, నేవల్ క్వార్టర్స్ వంటి ప్రాంతాలలో వివిధ జిల్లాల నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా ఉంటారు. వీరికి స్థానికంగానూ, అటు సొంతూళ్లలోనూ ఓటు హక్కులు ఉంటున్నాయి. జైఆంధ్ర కాలనీ, కాకర్లలోవ, ఎన్టీఆర్నగర్, త్రినాథపురంలో ఇప్పటికీ వేలాది గణన పత్రాలు ఓటర్ల నుంచి వెనక్కి రాలేదని, కేవలం ఒకే వార్డు పరిధిలోనే సుమారు 5 వేల పత్రాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
యాప్ ద్వారా 2002 వివరాల పరిశీలన
పాత ‘సర్’ వివరాలను ఓటర్లు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. ఓటర్లు ‘ECINET’ (ఈసీఐఎన్ఈటీ) అనే మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అందులోని ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్’ (Search your name in last SIR) అనే కాలమ్ ద్వారా 2002 ఓటర్ల జాబితాలో తమ పేరును సులభంగా వెతుక్కోవచ్చు. ఇందుకోసం రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
బీఎల్వోలు రాకపోతే సచివాలయమే దిక్కు
మీ ఇంటికి ఎన్యూమరేషన్ పత్రాలు (EF) అందకపోయినా లేదా ఇచ్చిన పత్రాలను తిరిగి తీసుకెళ్లడానికి సిబ్బంది రాకపోయినా ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే తమ సమీపంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించి ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
అధికారులతో నేరుగా కనెక్ట్
సచివాలయానికి వెళ్లలేని వారు ‘ECINET’ యాప్లోనే ‘కనెక్ట్ విత్ ఎలక్షన్ అఫిషియల్స్’ (Connect with Election Officials) అనే ఆప్షన్ను ఉపయోగించవచ్చు. అక్కడ రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం మరియు మీ ప్రాంతం వివరాలు ఇస్తే.. సదరు ఏరియా బీఎల్వో (BLO), ఈఆర్వో (ERO) మరియు జిల్లా ఎన్నికల అధికారి ఫోన్ నంబర్లు, వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి.
‘బుక్ ఏ కాల్’ సదుపాయం
ఈ యాప్లో ఓటర్ల సౌకర్యార్థం మరో ప్రత్యేక ఫీచర్ను కూడా పొందుపరిచారు. ఓటర్లు తమకు వీలైన సమయంలో వివరాలను నమోదు చేయడానికి ‘బుక్ ఏ కాల్ విత్ బీఎల్వో’ (Book a call with BLO) అనే ఆప్షన్ ద్వారా సంబంధిత అధికారితో మాట్లాడి, సమయాన్ని ఖరారు చేసుకునే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. కాబట్టి ఓటర్లు ఈ డిజిటల్ సేవలను ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
![]()



