ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్న పలు సంచలనాత్మక హత్యలు, మోసపూరిత ఘటనల నేపథ్యంలో వివాహ సంబంధాల విషయంలో ప్రజల ఆలోచనా విధానంలో తీవ్ర మార్పు వస్తోంది. కేవలం జాతకాలు కలవడం, ఉద్యోగం, జీతం చూసి పెళ్లిళ్లు ఖాయం చేసే రోజులు పోయి.. కాబోయే భాగస్వామి ప్రవర్తన, పాత బంధాలు, వ్యక్తిగత జీవితంపై ముందస్తు విచారణ (Premarital Background Check) జరిపించే సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది.
లోహగడ్ కోట సమీపంలోని ‘సియా పాయింట్’ వద్ద కాబోయే భర్త కేతన్ అగర్వాల్ను ప్రియురాలే నెట్టి చంపిన ఘటన, అలాగే ఇండోర్ వ్యాపారి రాజా రఘువంశీ దారుణ హత్య వంటి దిగ్భ్రాంతికర కేసుల తర్వాత దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఏకంగా ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు.
మ్యాట్రిమోనియల్ యాప్స్ ట్రెండ్.. పెరుగుతున్న అనుమానాలు
ఒకప్పుడు బంధువులు, పరిచయస్తుల ద్వారా పెళ్లి సంబంధాలు కుదిరేవి కాబట్టి ఒకరి గురించి ఒకరికి పూర్తి వివరాలు తెలిసేవి. కానీ, నేటి డిజిటల్ యుగంలో మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు, డేటింగ్ యాప్ల ద్వారా పూర్తిగా అపరిచితులైన వ్యక్తులతో సంబంధాలు కలుస్తున్నాయి. దీంతో పెళ్లికి ముందే కింది అంశాలపై ఆరా తీస్తున్నారు:
- ఆర్థిక, ఉద్యోగ వివరాలు: ఉద్యోగం నిజమైనదేనా, జీతం ఎంత, ఏవైనా పెద్ద ఎత్తున ఆర్థిక అప్పులు ఉన్నాయా?
- నేర చరిత్ర: అభ్యర్థికి సంబంధించి ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేదా కేసులు లేవు కదా?
- వ్యక్తిగత జీవితం: ఫ్రెండ్స్ సర్కిల్, అలవాట్లు, ఆఫీస్/హాస్టల్ వద్ద ప్రవర్తన.
- రహస్యాలు: గతంలో ఉన్న ప్రేమ వ్యవహారాలు, సీక్రెట్ పెళ్లిళ్లు, చివరకు కాల్ డేటా రికార్డులు (CDR) సేకరించాలని కూడా కొందరు డిటెక్టివ్లను కోరుతుండటం గమనార్హం.
చట్టపరమైన పరిమితులు: గోప్యతకు భంగం కలిగిస్తే నేరమే!
ముందస్తు తనిఖీలు (Background Checks) చేసుకోవడం చట్టరీత్యా నేరం కానప్పటికీ, ఎదుటివారి వ్యక్తిగత గోప్యతకు (Right to Privacy) భంగం కలిగించకూడదని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పబ్లిక్ రికార్డులు, సోషల్ మీడియా, అధికారిక విద్య/ఉద్యోగ పత్రాలు తనిఖీ చేయడం చట్టబద్ధమే. అయితే, సంబంధిత వ్యక్తి అనుమతి లేకుండా ప్రైవేట్ మెసేజ్లు, ఫోన్ కాల్స్ వివరాలు (CDR) సేకరించడం, వాట్సాప్ హ్యాక్ చేయడం లేదా నిరంతరం ఒకరిని ఫాలో అవ్వడం (Stalking) తీవ్రమైన నేరమవుతుందని విశ్రాంత ఐపీఎస్ అధికారి, ప్రముఖ న్యాయవాది వై.పి. సింగ్ స్పష్టం చేశారు.
![]()




