బ్యాంకులో తాకట్టు ఉంచిన ఆస్తి పత్రాలను నిర్లక్ష్యంగా పోగొట్టిన కేసులో ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) కి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ రూ. 3.20 లక్షల భారీ జరిమానా విధించింది. సేవా లోపానికి బాధ్యత వహిస్తూ బాధితుడికి రూ. 3 లక్షల నష్టపరిహారం, కేసు ఖర్చుల కింద మరో రూ. 20 వేలు చెల్లించాలని కమిషన్ ఆదేశించింది.
అసలేం జరిగింది?
ఇబ్రహీంపట్నం సమీపంలోని బొంగులూరుకు చెందిన బి.వెంకటేశం అనే వ్యక్తి ఎస్బీఐ ఆదిభట్ల శాఖ నుంచి రూ. 5 లక్షల గృహరుణం తీసుకున్నారు. ఈ రుణానికి అదనపు గ్యారంటీ (Collateral Guarantee) కింద తన బంధువైన ఎం.అంజయ్యకు చెందిన బైరామల్గూడలోని 194 చదరపు గజాల ఫ్లాట్ అసలు సేల్ డీడ్ (Original Sale Deed) మరియు లింక్ డాక్యుమెంట్లను బ్యాంకులో డిపాజిట్ చేశారు. 2022 మార్చిలో రుణానికి సంబంధించి చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా చెల్లించి ‘నో డ్యూస్’ (No Dues) సర్టిఫికెట్ కూడా పొందారు.
రెండేళ్ల తిప్పలు.. ఒట్టి చేతులతో పంపిన బ్యాంకు
రుణం తీరిపోయిన తర్వాత తన అసలు ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాల్సిందిగా వెంకటేశం బ్యాంకు అధికారులను కోరగా, కేంద్రీకరణ (Centralization) ప్రక్రియ కారణంగా ఆ పత్రాలు గన్ఫౌండ్రీ శాఖలో ఉన్నాయని, మరో 15 రోజుల్లో ఇస్తామని అధికారులు వాయిదాలు వేస్తూ వచ్చారు. ఆ తర్వాత అసలు పత్రాలు పోయాయని బ్యాంకు తేల్చేసింది. దాదాపు రెండేళ్ల పాటు బ్యాంకు చుట్టూ తిరిగిన బాధితుడికి కేవలం సర్టిఫైడ్ కాపీలు (Certified Copies) ఇచ్చి చేతులు దులిపేసుకుంది. దీంతో తీవ్ర నిరాశకు గురైన వెంకటేశం న్యాయం కోసం రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు.
బ్యాంకు విచిత్ర వాదనలు – తోసిపుచ్చిన కమిషన్
విచారణ సందర్భంగా ఎస్బీఐ తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు రకరకాల వాదనలు చేసింది. పత్రాలు పోయినందున పోలీసులకు ఫిర్యాదు చేశామని, పత్రికా ప్రకటన జారీ చేసి ప్రత్యామ్నాయ పత్రాలను అందించినందున తమ వైపు ఎలాంటి సేవాలోపం లేదని పేర్కొంది. అంతేకాకుండా, పోయిన పత్రాల అసలు యజమాని అంజయ్య కాగా, పిటిషన్ వేసిన వెంకటేశం ఫిర్యాదుదారు కాడని, కాబట్టి ఆయనకు పరిహారం పొందే హక్కు లేదని విచిత్ర వాదనలు వినిపించింది. అయితే, ఈ వాదనలను కమిషన్ తీవ్రంగా తోసిపుచ్చింది.
ఖాతాదారుడికే పూర్తి హక్కు.. తీర్పు వెల్లడి
సదరు గృహరుణ ఖాతా వెంకటేశం పేరు మీద ఉండి, ఆయనే పత్రాలను సమర్పించారు కాబట్టి బాధితుడిగా ఆయనకే పూర్తి హక్కులు ఉంటాయని కమిషన్ స్పష్టం చేసింది. బ్యాంకు నిర్లక్ష్యం వల్ల ప్రాథమిక హక్కు అయిన ఆస్తి పత్రాలను కోల్పోవడమే కాకుండా, ఫిర్యాదుదారు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడని అభిప్రాయపడింది. బ్యాంకుల నిర్లక్ష్యానికి బాధితులు మూల్యం చెల్లించుకోలేరని పేర్కొంటూ.. వెంకటేశంకు రూ. 3 లక్షల పరిహారం, కేసు ఖర్చుల కింద రూ. 20 వేలు వెంటనే చెల్లించాలని ఎస్బీఐని ఆదేశిస్తూ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది.
![]()




