భారత రాజకీయాల్లో ప్రముఖ ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) భాజపాకు బిగ్ షాక్ ఇచ్చారు. బిహార్లోని భాజపా బలమైన కంచుకోటగా పేరొందిన బాంకీపుర్ (Bankipur) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ఆయన అనూహ్య విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు తొలి రౌండ్ నుంచే స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించిన పీకే, ప్రత్యర్థి భాజపా అభ్యర్థి నీరజ్ కుమార్పై 18,964 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టనున్నారు.
30 ఏళ్ల కమలనాథుల కోటకు గండి
బాంకీపుర్ నియోజకవర్గం దశాబ్దాలుగా భాజపాకు తిరుగులేని స్థానంగా ఉంది. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్కు అడ్డాగా పేరొందిన ఈ స్థానంలో దాదాపు 30 ఏళ్ల తర్వాత కమలం పార్టీ ఓటమిపాలవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి గెలుపొందిన నితిన్ నబీన్, భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో పాటు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బాంకీపుర్లో జులై 30న ఉపఎన్నిక జరిగింది.
గత పరాజయం నుంచి చారిత్రక విజయం దాకా..
గత బిహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో పీకే నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ తీవ్ర నిరాశ పరిచింది. ప్రత్యక్షంగా పోటీ చేయకుండా 238 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ ఒక్క సీటూ గెలవలేకపోయింది. ఆ పరాజయానికి బాధ్యత వహిస్తూ పీకే కొద్దిరోజులు మౌనవ్రతం కూడా పూనారు.
అయితే, బాంకీపుర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే పీకే వ్యూహాత్మకంగా స్వయంగా రంగానికీ దిగారు. భాజపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, స్థానిక ఓటర్ల మార్పు ఆకాంక్షను ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ ఎన్నికను బిహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా అభివర్ణిస్తూ పీకే చేసిన ప్రచారం ప్రజలను బాగా ఆకట్టుకుంది.
పీకే గెలుపునకు ప్రధాన కారణాలు:
- సమస్యలే ఎజెండా: కులం, మతం వంటి సాంప్రదాయ బిహార్ రాజకీయ అంశాలకు దూరంగా ఉంటూ ప్రజాసమస్యలు, అభివృద్ధిపైనే ప్రధానంగా ప్రచారం చేశారు.
- ఓటు బ్యాంక్ చీలిక: అటు భాజపా, ఇటు ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీల సాంప్రదాయ ఓటు బ్యాంక్లో చీలిక తేవడంలో సఫలమయ్యారు.
- ముస్లిం ఓటర్ల మద్దతు: భాజపాను ఓడించే సామర్థ్యం పీకేకే ఉందని భావించిన ముస్లిం-యాదవ్ ఓటర్లు, అగ్రవర్ణాల్లోని కొంతభాగం ఆయనకు జై కొట్టారు.
- అధికార పార్టీ విభేదాలు: భాజపా అంతర్గత విభేదాలను, ప్రత్యర్థి అభ్యర్థికి ప్రజాదరణ లేకపోవడాన్ని పీకే సమర్థవంతంగా వినియోగించుకున్నారు.
ఇతర రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు:
బాంకీపుర్తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఫలితాలు కూడా వెలువడ్డాయి:
- గుజరాత్ (మంజల్పూర్): భాజపా ఎమ్మెల్యే యోగేశ్ పటేల్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన మంజల్పూర్ స్థానాన్ని భాజపా నిలబెట్టుకుంది. భాజపా అభ్యర్థి సతీశ్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి బికాభాయ్ రబారీపై 30 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- మధ్యప్రదేశ్ (దతియా): ఒక మోసం కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర భారతికి దిల్లీ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్ తన సమీప భాజపా అభ్యర్థి అశుతోష్ తివారీపై 6,016 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
![]()




