తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక దైవ దర్శన పర్యటనలతో ముందుకు వచ్చింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు ఒక్కరోజు టూర్ ప్యాకేజీలను ఈ నెల 27న ప్రవేశపెడుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల నుంచి బయల్దేరే డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల ద్వారా పలు ప్రముఖ దేవాలయాలకు రవాణా సౌకర్యం కల్పిస్తోంది. కొత్తగూడెం నుంచి వేములవాడ, కొండగట్టు, వరంగల్ ఆలయాలు, ఇల్లెందు నుంచి రామప్ప, లక్నవరం, మల్లూరు దేవాలయాలు; భద్రాచలం నుంచి అన్నవరం, ద్రాక్షారామం, యాదగిరిగుట్ట, స్వర్ణగిరి; మణుగూరు నుంచి రామప్ప, బొగత జలపాతం, అన్నవరం; ఖమ్మం నుంచి భద్రాచలం, వాడపల్లి; సత్తుపల్లి నుంచి మద్ది, ద్వారకా తిరుమల ఆలయాల వరకు బస్సులు నడపనుంది. ధరలు పెద్దలకు రూ.1,000–1,500, పిల్లలకు రూ.500–760 మధ్యగా ఉన్నాయి. భక్తులు RTC సేవలను వినియోగించుకోవాలని కొత్తగూడెం డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ అన్నారు.