పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న బలమైన ఎల్నినో (El Niño) ప్రభావంతో ప్రపంచం మరింత వేడెక్కే ప్రమాదం ఉందని యూకే వాతావరణ శాఖ (MET) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇది చాలా అరుదైన, బలమైన ఎల్నినోగా మారే సూచనలు కనిపిస్తున్నాయని, దీని ఫలితంగా 2027 సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో అత్యంత వేడి సంవత్సరంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఎల్నినో అంటే ఏమిటి?
భూమధ్యరేఖకు సమీపంలోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల జలాలు సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కే వాతావరణ పరిస్థితినే ‘ఎల్నినో’ అంటారు. ఇది కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఏర్పడి, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యతను, ఉష్ణోగ్రతలను మరియు వర్షపాత విధానాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
2027లో రికార్డు ఉష్ణోగ్రతల అంచనా
ప్రస్తుతం రూపుదిద్దుకుంటున్న ఎల్నినో మరింత బలపడితే ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతాయని యూకే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్లోబల్ ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఈ బలమైన ఎల్నినో తోడైతే 2027 నాటికి ఉష్ణోగ్రతలు ఆల్-టైమ్ రికార్డులను తిరగరాసే అవకాశం ఉందన్నారు. అయితే ఇది వాతావరణ నమూనాల ఆధారంగా వేసిన ప్రాథమిక అంచనా మాత్రమేనని తెలిపింది.
భారత్పై పడే ప్రభావం
ఎల్నినో ప్రభావం భారతదేశ నైరుతి రుతుపవనాలపై ప్రతికూలంగా పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
- వర్షపాతం క్షీణత: దేశంలో రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గడం, తీవ్ర వడగాడ్పులు పెరిగే పరిస్థితులు ఏర్పడవచ్చు.
- వ్యవసాయంపై ప్రభావం: వర్షాలు తగ్గడం వల్ల వ్యవసాయ రంగానికి, తాగునీరు మరియు సాగునీటి లభ్యతకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం ఉంది.
భారతీయ రుతుపవనాలపై ఎల్నినోతో పాటు ఇండియన్ ఓషన్ డిపోల్ (IOD) వంటి ఇతర సముద్ర పరిస్థితులు కూడా ప్రభావం చూపుతాయని, అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం అవసరమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
![]()




