దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్-యుజి (NEET-UG) పరీక్షల అక్రమాల వివాదం చివరకు రాజకీయంగా అత్యున్నత స్థాయి ముగింపునకు చేరుకుంది. నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా దేశ యువతను, విద్యార్థులను ఉద్దేశించి ఆయన ఒక భావోద్వేగపూరితమైన బహిరంగ లేఖను విడుదల చేశారు. తన నాలుగు పదుల రంగానుభవంలో విద్యార్థుల ప్రయోజనాలే పరమావధిగా పనిచేశానని, ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో వారి భవిష్యత్తు రాజకీయం కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
మే 3న జరిగిన లోపాలపై తక్షణ స్పందన
గత మే 3న జరిగిన నీట్-యుజి పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఎంతో తీవ్రంగా పరిగణించిందని ధర్మాంద్ర ప్రధాన్ తమ లేఖలో గుర్తుచేశారు. ప్రభుత్వం ఏమాత్రం అలసత్వం వహించకుండా సుమోటోగా స్పందించి, తక్షణమే విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి అప్పగించిందని వివరించారు. అంతేకాకుండా పారదర్శకతను కాపాడేందుకు ఆ పరీక్షను రద్దు చేసి, తిరిగి రికార్డు స్థాయిలో వేగంగా రీ-ఎగ్జామ్ పూర్తి చేశామని పేర్కొన్నారు.
భవిష్యత్తు పరీక్షలకు సీబీటీ (CBT) విధానం
పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టడానికి, ‘ఎగ్జామ్ మాఫియా’కు శాశ్వత చరమగీతం పాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (Computer-Based Test – CBT) విధానంలో నిర్వహిస్తామని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ప్రధాన్ వెల్లడించారు. సాంకేతికతను వినియోగించడం ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీలకు తావులేకుండా చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద విద్యార్థులకు లభించిన న్యాయం
జూన్ 21న నిర్వహించిన రీ-ఎగ్జామ్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జిల్లా యంత్రాంగాల సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశామని చెప్పారు. జులై 16న వెలువడిన ఫలితాలలో ఎంతోమంది పేద, వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు మంచి మార్కులు సాధించి విజయం సాధించడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు. ఏ ఒక్క అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరగకూడదనేదే తమ ప్రభుత్వ ప్రాథమిక సూత్రమని తెలిపారు.
రాజకీయ కుట్రలపై తీవ్ర ఆందోళన, ఆవేదన
పరీక్షల ప్రక్రియ ముగిసి, అర్హులైన విద్యార్థులకు సంపూర్ణ న్యాయం జరిగినప్పటికీ.. కొన్ని బాధ్యతారాహిత్యమైన శక్తులు, రాజకీయ ప్రత్యర్థులు విద్యార్థులను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించడం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాన్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాలను పక్కనబెట్టి విద్యార్థులలో గందరగోళం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారని, పదవుల కంటే దేశ యువత భవిష్యత్తే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.
న్యాయపరమైన చిక్కుల నుంచి విద్యార్థులకు విముక్తి
విద్యార్థుల విలువైన సమయం, శ్రమ సుదీర్ఘమైన కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల్లో (Legal Complexities) నలిగిపోకూడదనే తాపత్రయమే తన రాజీనామాకు ప్రధాన కారణమని ప్రధాన్ పేర్కొన్నారు. చదువుకోవాల్సిన వయస్సులో విద్యార్థులు కోర్టుల చుట్టూ, ఆందోళనల చుట్టూ తిరగడం దేశాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని లేఖలో అభిప్రాయపడ్డారు.
దేశ ఐక్యతే ప్రాథమిక కర్తవ్యం
ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను కొన్ని ‘దేశవ్యతిరేక శక్తులు’ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రమాదం ఉందనే ఆందోళనను ఆయన లేఖలో వ్యక్తం చేశారు. దేశంలో శాంతిభద్రతలు, ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్నా, యువత శక్తి తప్పుడు మార్గంలోకి మల్లకుండా ఉండాలన్నా బాధ్యతాయుతమైన నిర్ణయం తప్పనిసరని భావించి రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపినట్లు వెల్లడించారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
దేశసేవ చేసే గొప్ప అవకాశాన్ని తనకు కల్పించినందుకు, ప్రతిక్షణం మార్గదర్శనం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధర్మేంద్ర ప్రధాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనతో పాటు సహకరించిన కేబినెట్ సహచరులకు, విద్యాశాఖ అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
జగన్నాథుని ఆశీస్సులతో ప్రజాసేవ కొనసాగింపు
పదవిలో ఉన్నా లేకపోయినా దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడానికి, భారతమాత సేవకు, ఒడిశా ప్రజల సంక్షేమానికి జీవితాంతం కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పూరీ జగన్నాథుని ఆశీస్సులతో తానికపై కూడా సాధారణ కార్యకర్తగా ప్రజా క్షేత్రంలో ఉంటూ దేశాభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ ధర్మేంద్ర ప్రధాన్ తమ సుదీర్ఘ లేఖను ముగించారు.
![]()



