పొగాకు నియంత్రణలో విశేష కృషి చేస్తున్న హైదరాబాద్కు చెందిన పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ జాతీయ స్థాయిలో కీలక బాధ్యతను దక్కించుకున్నారు. పంజాబ్కు చెందిన ‘సైఫర్’ సంస్థ అందజేసే ప్రతిష్టాత్మక “టుబాకో కంట్రోల్ హీరో” అవార్డుల ఎంపిక కమిటీ సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ కమిటీలో చోటు సంపాదించిన ప్రప్రథమ తెలుగు వ్యక్తిగా రఘునందన్ రికార్డు సృష్టించారు.
గత 2025 సంవత్సరంలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును కైవసం చేసుకున్న తొలి వ్యక్తిగా నిలిచిన రఘునందన్కు, 2026 అవార్డుల ఎంపిక ప్రక్రియలో అర్హులైన వారిని నామినేట్ చేసే కీలక బాధ్యతను సంస్థ అప్పగించింది. పంజాబ్లోని చండీగఢ్ వేదికగా డాక్టర్ రాకేష్ గుప్తా నేతృత్వంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. రఘునందన్ గత 22 ఏళ్లుగా పొగాకు నిర్మూలనకై నిరంతరం శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన సుమారు 5,000 కిలోమీటర్లు ప్రయాణించి, 500 గ్రామాల్లోని ప్రజలకు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే ప్రాణాంతక అనర్థాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఆయన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం దక్కింది.
![]()




