ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య, భద్రత, కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో యంత్రాంగం విఫలమవుతోందని, సమస్యలు తాళలేక చిన్నారులు ప్రాథమిక హక్కుల కోసం రోడ్డెక్కడం విద్యావ్యవస్థ దయనీయ స్థితికి అద్దం పడుతోందని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనూరాధారావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా, నిత్యం విద్యార్థులు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారని విమర్శించారు.
: ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అనూరాధారావు డిమాండ్!
టాయిలెట్లు లేక విద్యార్థినుల డ్రాపౌట్స్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు క్షీణించాయని, తాగునీరు, సురక్షిత తరగతి గదులు లేవని తెలిపారు. తెలంగాణలో 1,161 పాఠశాలల్లో అసలు టాయిలెట్లు లేవని, ఉన్న 2,272 పాఠశాలల్లో నీటి సౌకర్యం లేక అవి పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఈ అపరిశుభ్ర పరిస్థితుల వల్లే మైనర్ అమ్మాయిలు పాఠశాలలను వదిలేస్తున్నారని (డ్రాపౌట్స్) ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో కనీస వసతుల కోసం విద్యార్థులు నిరసన తెలపగా అధికారులు స్పందించారని, ఇక్కడ కూడా 2025 నుంచి గురుకుల విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని గుర్తుచేశారు.
గురుకులాల్లో భయంకర పరిస్థితులు.. 48 మంది మృతి!
2025 గణాంకాల ప్రకారం గురుకులాల్లో కలుషిత ఆహారంతో (Food Poisoning) 886 మంది విద్యార్థులు ఆసుపత్రుల్లో చేరారని, ఆహార నాణ్యత లేకపోవడం, అపరిశుభ్రమైన వంటగదులు, ఈగలు-దోమల వల్లే డయేరియా వచ్చి 48 మంది చనిపోయారని తెలిపారు. సరైన నిఘా లేకపోవడం వల్లే ఈ అనాలోచిత సంఘటనలు పునరావృతమవుతున్నాయన్నారు. ఈ ఏడాది జులై 9న నాగర్ కర్నూల్ (అమ్రాబాద్), కామారెడ్డి, బెల్లంపల్లి, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ వందలాది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బాలల హక్కుల సంఘం డిమాండ్
ముఖ్యమంత్రి వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ, పేద కుటుంబాలకు చెందిన గురుకుల పిల్లల సమస్యలు పరిష్కారం కాకపోవడం విచారకరమని అనూరాధారావు వ్యాఖ్యానించారు. పోషకాహారం, నాణ్యమైన విద్య పొందడం పిల్లల రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు:
- విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, కలుషిత ఆహారానికి కారణమైన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
- అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు మరియు వసతి గృహాల్లో జిల్లా కలెక్టర్లు వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలి.
- ప్రతీ పాఠశాలలో పరిశుభ్రమైన తాగునీరు, నీటి వసతి ఉన్న టాయిలెట్లు, నాణ్యమైన భోజనాన్ని తక్షణమే అందుబాటులోకి తీసుకురావాలి.
అనూరాధ రావు
అధ్యక్షురాలు
బాలల హక్కుల సంఘం

![]()




