తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనదైన ముద్ర వేసి, నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికి వేలాదిమంది ప్రజలు, ఉద్యమకారులు మరియు రాజకీయ ప్రముఖులు శుక్రవారం అశ్రునయనాలతో కన్నీటి నివాళులర్పించారు. సికింద్రాబాద్లోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన పెద్ది సుదర్శన్రెడ్డి పార్థివదేహాన్ని యశోదా ఆసుపత్రి నుంచి హనుమకొండలోని అమరవీరుల స్తూపం వద్దకు తీసుకురాగా వందలాది మంది ప్రజలు మరియు ఉద్యమకారులు నివాళులర్పించారు.
హనుమకొండ నుంచి నర్సంపేట వరకు జనసంద్రంగా అంతిమయాత్ర
హనుమకొండ నుంచి వరంగల్ మీదుగా నర్సంపేట రోడ్డు మార్గంలో ఆ నియోజకవర్గం ప్రారంభమయ్యే గిర్నిబావి నుంచి పెద్ది అంతిమయాత్ర ప్రారంభమైంది. గిర్నిబావి నుంచి నల్లబెల్లి వరకు 31 కిలోమీటర్ల మేర సాగిన ఈ అంతిమయాత్ర జనసంద్రంగా మారింది. రహదారి మొత్తం కన్నీటి సముద్రంగా మారగా.. ‘పెద్ది అమర్ రహే‘, ‘జోహార్ పెద్దన్న’ నినాదాలతో మార్మోగిపోయింది. సాధారణంగా గంటలో పూర్తయ్యే ఈ ప్రయాణం.. ప్రతీ గ్రామంలో ప్రజలు చివరిసారి తమ నాయకుడిని చూసేందుకు పోటీపడటంతో గంటల తరబడి సాగింది.
‘అన్న లే అన్నా… రాఖీ తెచ్చానంటూ’ సోదరి విలాపం
అంతిమయాత్ర ప్రారంభమైన గిర్నిబావిలో ‘మళ్లీ ఎప్పుడూ వస్తావు పెద్దన్నా’ అంటూ మహిళలు విలపించిన తీరు హృదయాలను కదిలించింది. రహదారుల వెంట నిలబడ్డ ప్రజలే కాదు… వెళ్తున్న బస్సుల్లోని ప్రయాణికులు కూడా కిటికీల్లో నుంచి బయటకు వంగి పెద్ది పారి్థవదేహానికి చేతులెత్తి నమస్కరించారు. ఆయన సతీమణి పెద్ది స్వప్న ప్రజలను చూస్తూ ఉద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. అన్న లే అన్నా… రాఖీ తెచ్చానంటూ పెద్ది సోదరి విలపించడం కంటతడి పెట్టించింది.
నర్సంపేటలో స్వచ్ఛంద బంద్.. వేలాదిమందితో భారీ ర్యాలీ
తమ అభిమాన నాయకుడికి నివాళిగా నర్సంపేట పట్టణం స్వచ్ఛందంగా బంద్ పాటించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మరియు పాఠశాలలు స్వచ్ఛందంగా మూసివేసాయి. అయ్యప్ప టెంపుల్ నుంచి అంబేడ్కర్ సెంటర్ వరకు వేలాదిమంది ప్రజలు ర్యాలీగా పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కళాకారులు ఆలపించిన నివాళి గీతాలు వేలాదిమందిని కంటతడి పెట్టించాయి.
చివరి చూపునకు తరలివచ్చిన రాజకీయ ప్రముఖులు
పెద్ది సుదర్శన్రెడ్డి చివరి చూపునకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పాడి కౌశిక్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న మరియు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్యలు కూడా నల్లబెల్లిలో నివాళులర్పించారు.
నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
సాయంత్రం 6.30 గంటల మధ్యలో నల్లబెల్లికి చేరుకున్న సమయంలో జోరు వాన కురిసింది. నల్లబెల్లిలోని నివాసం నుంచి ఆయనకు అత్యంత ఇష్టమైన వ్యవసాయ క్షేత్రం వరకు వేలాదిమంది మధ్య ఊరేగింపుగా పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. పల్లా రాజేశ్వర్రెడ్డి, దయాకర్రావు మరియు పాడి కౌశిక్రెడ్డిలు పాడె మోశారు. ఓవైపు జోరు వాన కురిస్తున్నా వేలాది మంది ప్రజల మధ్య రాత్రి 10 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కుమారుడు నిదర్శన్రెడ్డి తండ్రి చితికి నిప్పంటించారు. నర్సంపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న పెద్ది సుదర్శన్రెడ్డికి ప్రజలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు.
![]()




