డ్రోన్ వేటగాళ్లు: భారత సైన్యంలో ‘రెక్కల’ సైనికులు

TwitterWhatsAppFacebookTelegramShare

సరిహద్దుల్లో సరికొత్త సవాలు

భారతదేశానికి సుమారు 15 వేల కిలోమీటర్లకు పైగా ఉన్న సుదీర్ఘ భూ సరిహద్దులను కాపాడటం మన సైనికులకు నిరంతర సవాలు. రాడార్ల కళ్లుగప్పి వచ్చే చిన్నపాటి డ్రోన్‌ల ద్వారా శత్రుదేశాలు మాదకద్రవ్యాలు, ఆయుధాలు, నకిలీ కరెన్సీని మన దేశంలోకి పంపిస్తున్నాయి. ఈ ముప్పును ఎదుర్కోవడానికి అత్యాధునిక సాంకేతికతతో పాటు, భారత సైన్యం ఒక పురాతన కానీ అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేసింది. అవే సుశిక్షితమైన గద్దలు మరియు డేగలు.

శిక్షణ పొందిన ‘అర్జున్ ఈగిల్స్’

ఉత్తరాఖండ్‌లోని ఔలిలో జరిగిన భారత్-అమెరికా సైనిక విన్యాసాల్లో ఈ పక్షి సైనికులు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా ‘కరణ్’, ‘అర్జున్’ అనే రెండు నల్లగద్దలు వందలాది డ్రోన్‌లను కూల్చివేసి తమ సత్తా చాటాయి. వీటికి మీరట్‌లోని రీమౌంట్ వెటర్నరీ కోర్ (RVC) లో కఠినమైన శిక్షణ ఇచ్చారు. వీటి తలపై బుల్లి కెమెరాలు అమర్చి, సరిహద్దుల్లో వేగుల (Spies) లాగా ఉపయోగిస్తున్నారు. వీటి సేవలను గుర్తిస్తూ ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కూడా వీటిని ప్రదర్శించారు.

చారిత్రక నేపథ్యం – ప్రపంచ దేశాల బాట

యుద్ధాల్లో పక్షుల వినియోగం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధంలో పావురాలను సమాచార సేకరణకు వాడగా, వాటిని వేటాడేందుకు జర్మనీ గద్దలను ప్రయోగించింది. ఆధునిక కాలంలో డ్రోన్ల బెడద ఎక్కువయ్యాక 2016లో నెదర్లాండ్స్ పోలీసులు, ఆ తర్వాత ఫ్రాన్స్ వాయుసేన ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. భారతదేశంలో 2020లో ‘ఫాల్కన్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్’ ఏర్పాటైంది. మన తెలంగాణ పోలీసులు కూడా ‘గరుడ ఫోర్స్’ పేరుతో ఇలాంటి విభాగాన్ని రూపొందించడం విశేషం.

ఎందుకు ఈ పక్షులే మేలు?

డ్రోన్లను కూల్చడానికి గద్దలు, ఫాల్కన్ పక్షులను ఎంచుకోవడానికి ప్రధాన కారణం వాటి ‘డేగ కన్ను’ మరియు వ్యూహాత్మక వేట. ఇవి డ్రోన్లను నేరుగా ఢీకొట్టవు. పక్క నుండి వచ్చి తమ బలమైన గోళ్లతో డ్రోన్ రెక్కలను (Propellers) తెగ్గొడతాయి. వీటికి గాయాలు కాకుండా కాళ్లకు లెదర్ కవచాలను తొడుగుతారు. ఒక్కో పక్షి శిక్షణకు ఏడాదికి సుమారు ₹5 లక్షలు ఖర్చవుతుంది. ఇది కోట్లాది రూపాయల ఖరీదైన యాంటీ-డ్రోన్ వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువ.

సైన్యంలో వీటి హోదా

ప్రస్తుతం మన సైన్యంలో సుమారు 15 పక్షులు సేవలందిస్తున్నాయి. వీటన్నింటినీ కలిపి ‘అర్జున్ ఈగిల్స్’ అని పిలుస్తారు. వీటికి సైన్యంలో ఉండే జాగిలాల (Dogs) తరహాలోనే ప్రత్యేక హోదాను కల్పిస్తున్నారు. ప్రముఖ సేనా మెడల్ గ్రహీత లాన్స్ నాయక్ రాజేష్ కుమార్ వీటిని పర్యవేక్షిస్తున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా, ప్రకృతి ప్రసాదించిన ఈ వేటగాళ్ల నైపుణ్యం ముందు యంత్రాలు కూడా తలవంచాల్సిందేనని ఈ పక్షి సైనికులు నిరూపిస్తున్నారు.


Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
Exit mobile version